బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ సంజయ్ కుటుంబానికి గవర్నర్ ఆర్ధిక సాయం

గత నెలలో ఫుడ్ పాయిజన్ తో చనిపోయిన బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ సంజయ్ కిరణ్ కుటుంబానికి తెలంగాణ గవర్నర్ తమిళసై 2 లక్షల ఆర్థికసాయం అందజేశారు. ట్రిపుల్ ఐటీకి వెళ్ళినప్పుడు సంజయ్ కిరణ్ ది నిరుపేద కుటుంబం అని తెలుసుకుని బాధపడిపట్లు తెలిపారు. అతని సోదరుడు ఉదయ్ కిరణ్ ధైర్యంతో ఉండి కుటుంబానికి అండగా నిలవాలన్నారు.

బాసర ట్రిపుల్ ఐటీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోవాలని గవర్నర్ సూచించారు. స్టూడెంట్స్ అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని.. ఛాలెంజెస్ను ఫేస్ చేయాలని తెలిపారు. కరోనా తరువాత చాలా మంది డిప్రెషన్లోకి వెళ్తున్నారని.. అయితే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని తమిళసై అన్నారు. ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని.. మెడికల్ సౌకర్యాలు మెరుగుపర్చాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇక ఈరోజు గవర్నర్ వరంగల్ లోని కాకతీయ యూనివర్శిటీలో జరిగిన 22వ స్నాతకోత్సవంలో ఆమె పాల్గొన్నారు. 2019-20 విద్యాసంవత్సరంలో వివిధ కోర్సుల్లో పీహెచ్డీ చేసిన 56 మందికి డాక్టరేట్ పట్టాలను ప్రదానం చేసి, మరో 276 మందికి గోల్డ్ మెడల్స్ అందించారు.