ఉక్రెయిన్‌లో రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ

ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకేనని వెల్లడి

హైదరాబాద్: ఉక్రెయిన్ మొత్తాన్ని ఆక్రమించుకునేందుకు వడివడిగా ముందుకు సాగుతున్న రష్యా దళాలు.. కాసేపు కాల్పుల విరమణను ప్రకటించాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు మానవతా దృక్పథంతో రష్యా కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల నుంచి (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలు) కొన్ని గంటలు మరిపోల్, వొల్నోవఖాల్లో కాల్పులు జరపబోమని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ఈ సమయంలో ప్రజలకు ఆహారం అందించనున్నారు. దీంతోపాటు ప్రాథమిక చికిత్స చేయనున్నారు. దీంతోపాటు రెండు పట్టణాల్లో విద్యుత్‌, నీటి సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొన్నది.

అయితే, కీవ్, చెర్నిహివ్, సూమీల్లో మాత్రం ఎయిర్ రైడ్స్ తో విరుచుకుపడుతోంది. తాజాగా కూడా ఎయిర్ రైడ్స్ సైరన్స్ ను అక్కడ మోగించారు. ప్రస్తుతం సూమీ, ఖార్కివ్ లలో 1000 మందిదాకా భారతీయ విద్యార్థులున్నారు. కాగా, చెర్నోబిల్ అణు రియాక్టర్ వద్ద వాహనాల తాకిడి పెరిగిపోవడంతో అణుధార్మిక స్థాయులు పెరిగిపోయాయని స్లావుటిచ్ మేయర్ యూరీ ఫొమిచెవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ అణుధార్మికత ఉక్రెయిన్ అంతటా వ్యాపిస్తుందని చెప్పారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/