పవన్ కళ్యాణ్‌తో తిట్టించుకోవాలా? అంటూ రోజా ట్వీట్

వైస్సార్సీపీ మంత్రి రోజా ఫై పరోక్షంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యువశక్తి సభలో కాస్త ఘాటుగానే కామెంట్స్ చేసారు. ప్రజల కోసం ప్రతి వెధవ, సన్నాసితో మాటలు పడుతున్నానని చెప్పారు. డైమండ్ రాణి రోజా కూడా తన గురించి మాట్లాడుతున్నారంటూ సెటైర్లు వేశారు. మీ కోసం డైమండ్ రాణిలతో కూడా తిట్టించుకుంటున్నానని వ్యాఖ్యానించారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది తిట్టడానికి కాదని.. ఒకరితో మాటలు పడుతున్నా తనకు బాధ లేదని పవన్ కళ్యాణ్ అన్నారు.

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. గురువారం మంత్రి రోజా ట్వీట్ చేశారు. రెండు సార్లు గెలిచిన తాను.. రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్‌తో తిట్టించుకోవాలా? తూ.. ప్రజల కోసం తప్పట్లేదు అంటూ మంత్రి రోజా ట్వీట్ చేసారు. అంతే కాదు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అంటూ ఓ యాష్ ట్యాగ్ ను సైతం జోడించారు.

రీసెంట్ గా రోజా మెగా బ్రదర్స్ ఫై ఘాటైన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్‌తో పాటు చిరంజీవి, నాగబాబులను జనం ఓడించారంటే వారికి రాజకీయ భవిష్యత్తు లేదనే విషయం అర్థమవుతోందని.. సాధారణంగా సినీ నటులు సెన్సిటివ్‌గా ఉంటారని.. అందరికీ సాయం చేస్తారు కానీ.. వీళ్లు మాత్రం అందుకు భిన్నమని రోజా విమర్శించారు. ఇక చిరంజీవి ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేస్తూ.. పవన్ కళ్యాణ్‌ని చంద్రబాబు దత్తపుత్రుడని.. ప్యాకేజీ స్టార్ అని విమర్శలు గుప్పించారు. ఈమె విమర్శలపై మెగా అభిమానులు , జనసేన కార్యకర్తలే కాదు సినీ పరిశ్రమ సైతం రోజా వ్యాఖ్యలను తప్పుపట్టింది.