బిఆర్ఎస్ తప్పులు అంగీకరించి సలహాలు ఇవ్వాలి… ఎదురుదాడి చేయొద్దుః సీఎం రేవంత్

revanth-redd- speech-in-ts-assembly

హైదరాబాద్‌ః నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించి గత బిఆర్ఎస్ ప్రభుత్వం తప్పులను అంగీకరించి తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పి ఉంటే బాగుండేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బిఆర్ఎస్ తాము చేసిన తప్పులను అంగీకరించి తమ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తే కొంతమేర అయినా తెలంగాణ సమాజం అభినందించేదని చెప్పారు. నీటి పారుదల రంగంపై తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. దీనిపై జరిగిన స్వల్పకాలిక చర్చలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.

నీటి పారుదల రంగంపై విపక్షాలు తమ అభిప్రాయాన్ని చెప్పాయని, అయితే గత ప్రభుత్వం గోదావరి ప్రాజెక్టులపై విశ్రాంత ఇంజినీర్లతో కమిటీ వేసిందని… ఆ కమిటీ నివేదికను తాను సభ ముందు ఉంచుతున్నానని సీఎం తెలిపారు. తుమ్మిడిహెట్టి వద్ద కాకుండా మరోచోట ప్రాజెక్టు రీడిజైనింగ్‌కు ఇక్కడే పునాది పడిందన్నారు. బీఆర్ఎస్ తప్పులు అంగీకరించి సలహాలు ఇవ్వాలని… కానీ ఎదురుదాడి చేయడం సరికాదన్నారు. మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే తప్పుల తడక అని చెప్పడం విడ్డూరమన్నారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేయడం సరికాదని హితవు పలికారు.