త్వరలో కాంగ్రెస్లోకి భారీగా చేరికలు : రేవంత్ రెడ్డి
పరిస్థితులను బట్టి నేతలను పార్టీలోకి తీసుకుంటామని వెల్లడి
హైదరాబాద్ః రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో భారీ ఎత్తున చేరికలు ఉంటాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆయా జిల్లాల్లో ఉన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వారిని పార్టీలోకి తీసుకుంటున్నట్టు రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే, కాంగ్రెస్ లో చేరేవారి గురించి ముందు తెలుస్తుండడంతో, వారిపై టీఆర్ఎస్ కేసులు పెట్టి వేధిస్తోందని ఆరోపించారు. ఈ కారణంగానే కాంగ్రెస్ లో చేరేవారి పేర్లను వెల్లడించడంలేదని స్పష్టం చేశారు.
కాగా, బీజేపీ, ప్రశాంత్ కిశోర్ లతో కలిసి కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ ప్రతిపక్షాలు లేకుండా చేయాలని ప్రశాంత్ కిశోర్ పథక రచన చేస్తున్నాడని తెలిపారు. పశ్చిమ బెంగాల్ లో విపక్షాలు తుడిచిపెట్టుకుపోవడానికి పీకేనే కారణమని ఆరోపించారు. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టి ఈ జులై 7వ తేదీకి ఏడాది పూర్తవుతుందని రేవంత్ వెల్లడించారు. ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకున్న వ్యవహారాలను పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కు వివరించినట్టు తెలిపారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/international-news/