2004లోనే ఉచిత విద్యుత్ అందించిన పార్టీ కాంగ్రెస్ : రేవంత్ రెడ్డి

revanth-reddy

హైదరాబాద్‌ః ఉమ్మడి ఏపీలో అత్యంత వెనకబడిన జిల్లా ఆదిలాబాద్‌.. తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల తర్వాత అత్యంత వెనకబడిన జిల్లా కూడా ఉమ్మడి ఆదిలాబాద్‌ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన విజయభేరి సభలో పాల్గొన్నారు. ప్రాణహిత ద్వారా ఆదిలాబాద్‌ జిల్లాలో 1.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కాంగ్రెస్‌ పనులు ప్రారంభించిందని తెలిపారు. తుమ్మిడిహట్టి దగ్గర నిర్మించాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డ వరకు మార్చారని.. 38 వేల 500 కోట్లతో నిర్మించాల్సిన కాళేశ్వరాన్ని లక్షా 51 వేల కోట్లకు పెంచారని బిఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.

వివేక్‌, వినోద్‌ను ఎమ్మెల్యేలుగా గెలిపించాల్సిన బాధ్యత ఇక్కడి ప్రజలదేనని రేవంత్ అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం కాకా పేరుమీదనే ఉందని చెప్పారు. 2004లోనే 9 గంటల ఉచిత విద్యుత్‌ అందించిన పార్టీ కాంగ్రెస్‌ అని తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల నాణ్యతతో కూడిన విద్యుత్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. ధరణి మార్చి ప్రత్యామ్నాయంగా మరొకటి తీసుకువస్తామని మాటిచ్చారు. 58లక్షల రైతులకు రైతు భరోసా అందిస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్మించిన సాగర్, శ్రీశైలం, కల్వకుర్తి ప్రాజెక్టులు ఎంత వరదొచ్చినా తట్టుకుని నిలబడ్డాయని ఆయన పేర్కొన్నారు. బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులు 50 ఏళ్లుగా వరదలకు తట్టుకుని నిలబడ్డాయన్నారు. కెసిఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చీ రాగానే కుంగిపోయిందని రేవంత్ ఆరోపించారు.