ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెసిఆర్‌.. అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశం

కెసిఆర్ ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వివరాలను అందించండి..

revanth-reddy-orders-officials-to-inform-him-about-kcr-health-updates

హైదరాబాద్‌ః మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ గాయపడిన సంగతి తెలిసిందే. తన ఫామ్ హౌస్ లోని బాత్రూమ్ లో ప్రమాదవశాత్తు జారిపడిన కెసిఆర్ కు తుంటి ఎముక విరిగింది. ప్రస్తుతం ఆయన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డాక్టర్లు ఆయనకు ఆపరేషన్ నిర్వహించనున్నారు. మరోవైపు, కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిపై తనకు ఎప్పటికప్పుడు వివరాలను అందజేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

కాసేపటి క్రితం ప్రగతిభవన్ లో రేవంత్ ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి సెక్రటేరియట్ కు చేరుకున్నారు. సీఎంగా బాధ్యతలను స్వీకరించిన వెంటనే విద్యుత్ శాఖపై రేవంత్ దృష్టి సారించిన సంగతి తెలిసిందే. విద్యుత్ శాఖలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని సీఎం భావిస్తున్నారు. కాసేపట్లో విద్యుత్ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకరరావు రాజీనామాను కూడా ఆమోదించవద్దని… ఈరోజు జరగే సమీక్ష సమావేశానికి ఆయనను కూడా పిలవాలని ఆదేశించారు.