కమ్యూనిస్టులఫై జాలి చూపిస్తున్న రేవంత్ రెడ్డి

టిఆర్ఎస్ పార్టీకి మద్దతు పలికిన కమ్యూనిస్టులను చూస్తే జాలేస్తుందన్నాని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మునుగోడులో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..మునుగోడులో కమ్యూనిస్టు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని కోరారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీల అమలులో పూర్తిగా విఫలమైందని .. సెప్టెంబర్ 17 ను ఘనంగా నిర్వహించేందుకు కేంద్రం 5 వేల కోట్ల రూపాయలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించని టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం జరిగినప్పుడు బిజెపి ఎక్కడుందని ప్రశ్నించారు. సాయుధ పోరాటంలో సామాన్యులు తుపాకీ తూటాలకు బలైన నాడు బిజెపి ఎటు పోయిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వతంత్రాన్ని, నిజం ప్రభువు నుంచి విముక్తిని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని గుర్తుచేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబం మాదని రేవంత్ రెడ్డి అన్నారు.

ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ తో పాటు ప్రజలను మోసం చేయడం వల్లే ఉప ఎన్నిక వచ్చిందని విమర్శించారు. మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట అన్న ఉత్తమ్ కుమార్.. బీజేపీలో చేరితే మునుగోడు ఎలా అభివృద్ధి చెందుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. 8 ఏండ్లలో జరగని అభివృద్ధి ఇప్పుడెట్లా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు ప్రజల కోసం చేసిందేమీ లేదని ఉత్తమ్ ఆరోపించారు. టీఆర్ఎస్, బీజేపీ మోసాలపై విడుదల చేసిన ఛార్జ్ షీట్ ప్రతి ఇంటికీ చేరాలని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు, భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వకపోవడం, డిగ్రీ కాలేజీల ఏర్పాటు హామీ, పోడు భూముల సమస్యపై నిర్లక్ష్యం, డబుల్ బెడ్రూం ఇండ్ల హామీ, ఫ్లోరైడ్ సమస్య తదితర అంశాలపై ప్రజలను టీఆర్ఎస్ ఎలా మోసం చేసిందో ప్రజలకు వివరించాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు.