రేపల్లె లో బీఆర్ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల చేసారని బ్యాంకు ఉద్యోగిని చితకబాదారు

బీఆర్ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల చేసారని గోల్డ్ లోన్ బ్యాంకులో పనిచేసే ఈశ్వర్ అనే వ్యక్తిని చితకబాదిన ఘటన రేపల్లెలో చోటుచేసుకుంది. పట్టణంలోని స్టేట్‌ బ్యాంక్ సమీపంలోని ఓ ప్రైవేటు గోల్డ్ లోన్ బ్యాంకులో ఈశ్వర్ పనిచేస్తున్నారు. తాజాగా ఈయన అంబేద్కర్‌పై అనుచిత కామెంట్స్‌ చేస్తూ వాటిని తన వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకున్నాడు. ఆ వెంటనే అవి వైరల్‌గా మారడంతో గుర్తు తెలియని వ్యక్తులు ఈశ్వర్‌ను పట్టుకుని చితకబాదారు.

ఈ ఘటన విషయం తెలుసుకున్న రేపల్లె ఎస్సైలు భరత్‌కుమార్, అబ్దుల్ కుమార్ అక్కడికి చేరుకుని వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడం తో..ఆందోళనకారులు మరింతగా రెచ్చిపోయి వారిపైనా దాడిచేశారు. వారి వాహనాన్ని ధ్వంసం చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది.

అతి బలవంతం మీద ఈశ్వర్‌ను కారులోకి ఎక్కించిన పోలీసులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. అప్పుడు కూడా ఆందోళనకారులు కారుపై దాడిచేసి అద్దాలు పగలగొట్టారు. చివరికి ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు ఈశ్వర్‌ను గుంటూరు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.