సినీ నటి సాయిపల్లవిని అరెస్ట్ చేయాలి : రాజాసింగ్

కశ్మీరీ పండిట్ల ఊచకోతపై సాయిపల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాద్: తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సినీ నటి సాయిపల్లవిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీరీ పండిట్ల ఊచకోతపై సాయిపల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై రాజాసింగ్ స్పందిస్తూ… హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదని అన్నారు. కశ్మీర్ కు వెళ్లి అక్కడి పండిట్లను కలిస్తే జరిగిన ఘోరాలు తెలుస్తాయని చెప్పారు. ఏపీ, తెలంగాణలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో సాయిపల్లవిపై కేసులు పెట్టాలని ఆయన సూచించారు. ఒకరిని అరెస్ట్ చేస్తే మరొకరు హిందువుల జోలికి రారని చెప్పారు.

తాము పాప్యులర్ కావాలని, తమ సినిమా పాప్యులర్ కావాలని కొందరు నటీనటులు, దర్శకులు వ్యవహరిస్తుంటారని అన్నారు. సినిమా కోసం కమ్యూనిస్టు పుస్తకాలు చదివి సాయిపల్లవి మైండ్ పాడయిందని వ్యాఖ్యానించారు. ముస్లింల పైన, క్రిస్టియన్స్ పైన కామెంట్ చేసే దమ్ము మీకుందా? అని ఆయన ప్రశ్నించారు. ఏమీ చేయరు కదా అని హిందువులపై కామెంట్లు చేస్తే సహించబోమని చెప్పారు. సాయి పల్లవిని అరెస్ట్ చేయాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/