తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కబ్జా టీం

కన్నడ నటులు ఉపేంద్ర, సుదీప్ లు హీరోలుగా నటించిన కబ్జా మూవీ రేపు వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో విడుదల కాబోతుంది. ఈ తరుణంలో ఉపేంద్ర తో పాటు దర్శకుడు చంద్రు ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికీ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

దర్శనం తర్వాత ఉపేంద్ర మీడియాతో మాట్లాడుతూ.. తాను నటించిన ‘కబ్జా’ చిత్రం విడుదల సందర్భంగా ఆశీర్వాదం కోసం శ్రీవారిని దర్శించుకున్నానని అన్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడం భారతీయ చలనచిత్ర రంగానికి గర్వకారణమని ఉపేంద్ర తెలిపారు. ఆర్ఆర్ఆర్ యూనిట్ కు ఈ సందర్భాంగా అభినందనలు తెలిపారు.

శ్రీ సిద్దేశ్వర ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్‌ పై ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. ఆర్ చంద్రు ఈ సినిమాకు దర్శకత్వం వహించగా కన్నడ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి కావడం గమనార్హం. పీరియాడికల్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు రవి బస్రూర్ సౌండ్ ట్రాక్ లు సమకూర్చారు. శ్రియ, కోట శ్రీనివాసరావు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించగా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.