యూపీలో ఉండాలనుకుంటే యోగికే ఓటు వేయాలి : ఎమ్మెల్యే రాజాసింగ్

హైదరాబాద్: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలనం వ్యాఖ్య‌లు చేశారు. యూపీలో బీజేపీకి మద్దతివ్వని వారిని హెచ్చరిస్తూ ఓ వీడియో విడుద‌ల చేశారు. యూపీలో ఉండాలనుకుంటే యోగికే ఓటు వేయాలని చెప్పారు. ఎన్నిక‌ల అనంత‌రం.. బీజేపీ ఓటు వేయని వారి జాబితా తీస్తామ‌ని, వారి ఇళ్లపైకి బుల్డోజర్లు, జేసీబీలను పంపిస్తామని వ్యాఖ్యానించారు. ఇప్ప‌టికే యోగి వేల సంఖ్యలో బుల్డోజర్లు, జేసీబీలను యూపీకి తెప్పించారని రాజా సింగ్ చెప్పారు.

బీజేపీకి ఓటు వేయని వారు ఎన్నికల తర్వాత యూపీ నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. రెండో దశ ఎన్నికల పోలింగ్ జరిగిందని, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పోలింగ్ శాతం ఎక్కువగా ఉందని చెప్పారు. ఎన్నికల్లో హిందువులంతా ఏకం కావాలని, అందరూ కలిసి యోగి ఆదిత్యనాథ్కు ఓటు వేసి మరోసారి గెలిపించాలని అన్నారు. యోగి మళ్లీ సీఎం కాకూడదని కొంద‌రు కుట్రలు పన్నుతున్నారని చెప్పారు. మూడో దశ పోలింగ్లో బీజేపీకి ఓటు వేయని వాళ్లను గుర్తిస్తామ‌ని అన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/