బీహార్ రైలు ప్రమాదం.. బాధితులకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన రైల్వే
బుక్సర్: బీహార్ లోని బుక్సర్ జిల్లాలో బుధవారం రాత్రి 9.35 గంటల సమయంలో నార్త్ఈస్ట్ సూపర్ఫాస్ట్ రైలు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. ఆ దుర్ఘటనలో నలుగురు ప్రయాణికులు మృతిచెందారు. మరో 50 మంది గాయపడ్డారు. రైలు ప్రమాద బాధితులకు పది లక్షల నష్టపరిహారాన్ని ఇవ్వనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ ప్రమాద ఘటన పట్ల ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు రైల్వేశాఖ తెలిపింది. ఈ ప్రమాదం పట్ల బీహార్ సీఎం నితీశ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన వారిని ఉషా భండారి, ఆకృతి భండారి, అబూ జైద్, నరేంద్రగా గుర్తించారు. ఢిల్లీ నుంచి అస్సాంలోని టిన్సుకియా వెళ్తున్న రైలు బుధవారం రాత్రి రఘునాథ్పుర్ వద్ద పట్టాలు తప్పింది. ఈస్ట్ సెంట్రల్ రైల్వే శాఖకు చెందిన రెస్క్యూ బృందం ప్రమాద స్థలానికి చేరుకున్నది.