దొరల పాలనను అంతం చేసి ప్రజల పాలన తెచ్చుకోవాలిః రాహుల్‌గాంధీ

rahul-gandhi-election-campaign-in- bodhan

బోధన్: తెలంగాణ శాసనసభ ఎన్నికల సమరం రసవత్తరంగా మారుతోంది. ప్రచారానికి మరో నాలుగు రోజులే గడువు ఉండటంతో ప్రధాన నేతలంతా ఎన్నికల క్షేత్రంలోకి దిగారు. ముఖ్యంగా కాంగ్రెస్, బిజెపి జాతీయ నేతలు రాష్ట్రంలో క్యూ కడుతున్నారు. ఈరోజు రాష్ట్రానికి వచ్చిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ.. నిజామాబాద్ జిల్లా బోధన్​లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్, బిఆర్ఎస్ పార్టీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

తెలంగాణలో ల్యాండ్‌, సాండ్‌, వైన్స్‌ మాఫియా పెరిగిందని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ల్యాండ్‌, సాండ్‌, వైన్స్‌పై వచ్చే డబ్బంతా కెసిఆర్‌ ఇంటికే చేరిందని అన్నారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను ఎస్సీల కోసం ఖర్చు చేయలేదని.. తెలంగాణలో ప్రజల పాలన అనేది కనిపించటం లేదని ధ్వజమెత్తారు. కుటుంబ, అవినీతి పాలన వల్ల తెలంగాణ నష్టపోయిందని విమర్శించారు. దొరల పాలనను అంతం చేసి ప్రజల పాలన తెచ్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బిఆర్ఎస్, బిజెపి పాలనలో గ్యాస్ సిలిండర్ రూ.1200 ఉందని.. కాంగ్రెస్‌ గెలిస్తే.. ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.