జగన్ ను ఆకాశానికి ఎత్తేసిన ఆర్ కృష్ణయ్య
ఏపీ ముఖ్యమంత్రి , వైస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ని బీసీ నేత ఆర్. కృష్ణయ్య ఆకాశానికి ఎత్తేసారు. దేశంలో నెంబర్ వన్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. బీసీలు, ఎస్టీలకు, ఎస్సీలకు సమ ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని , ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పథకాలు ఉత్తర్ ప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాయని అన్నారు. చదువు వల్లనే వెనకబడిన కులాలకు గౌరవం పెరుగుతుందని అలాంటి చదువును అమ్మ ఒడి పథకం ద్వారా పేదలకు దగ్గర చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని కృష్ణయ్య అన్నారు.
కర్ణాటక బళ్లారి ప్రజలు, తమిళనాడులోని నీలగిరి,కృష్ణ గిరి ప్రాంతాల వారు కూడా మమ్మల్ని ఆంధ్ర ప్రదేశ్ లో కలుపుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి పాలన బాగుందని వారంతా అంటున్నారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు మంత్రి పదవులు కూడా లభించలేదని.. జగన్ మోహన్ రెడ్డి మాత్రం పది మందికి మంత్రి పదవులు ఇచ్చారని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఉన్న కృష్ణయ్యను చంద్రబాబునాయుడు ఒక ప్రయోగం చేద్దామనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి మరీ 2014లో ఎల్బీ నగర్ సీటిచ్చారు. అక్కడ గెలిచినప్పటికీ తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది. 2019 ఎన్నికల సమయానికి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని మిర్యాలగూడ నుంచి పోటీకి దిగి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఉప ఎన్నికలు జరిగిన సమయంలో అధికార టీఆర్ ఎస్కు మద్దతు పలికారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వైసీపీకి మద్దతుగా ఏపీలో ప్రచారం చేశారు.