పంజాబ్‌లో విషాదకర ఘటన..కేక్ తిని 10 ఏళ్ల చిన్నారి మృతి

పుట్టినరోజు నాడు ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చి తెప్పించిన కేక్ తిని మాన్వీ అనే పదేళ్ల బాలిక మరణించిన ఘటన పంజాబ్‌లోచోటుచేసుకుంది. ఫుడ్ పాయిజన్‌ కారణంగా బాలిక ప్రాణాలు కోల్పోయి ఉంటుందని తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. కేక్ తిన్న తర్వాత కుటుంబ సభ్యులంతా అస్వస్థతకు గురయ్యారని బాలిక తాతయ్య చెప్పాడు. మృతురాలి చెల్లెలు కూడా స్పృహ తప్పిపడిపోయిందని, పాటియాలలోని ‘కేక్ కన్హా’ బేకరీ నుంచి ఈ కేక్‌ను ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చి తెప్పించినట్టు వెల్లడించాడు. మార్చి 24న రాత్రి 7 గంటల సమయంలో కేక్ కటింగ్ జరిగిందని, రాత్రి 10 గంటల సమయంలో బాలిక సహా, కుటుంబ సభ్యులంతా అస్వస్థతకు గురయ్యారని తాతయ్య హర్బన్ లాల్ వివరించాడు. అందరూ వాంతులు చేసుకున్నారని చెప్పాడు. విపరీతంగా దాహం అవుతోందంటూ మాన్వీ మంచినీళ్లు అడిగిందని, నోరు ఆరిపోతోందని చెప్పిందని పేర్కొన్నాడు. ఆ తర్వాత ఆమె నిద్రలోకి జారుకుందని వివరించాడు. అయితే మరుసటి రోజు ఉదయం ఆమె ఆరోగ్యం క్షీణించిందని గుర్తించి ఆసుపత్రికి తరలించామని తాతయ్య హర్బన్ లాల్ వివరించాడు.

బాలిక మాన్వీకి ఆక్సిజన్‌ పైపు అమర్చి శ్వాస అందించారని, ఈసీజీ తీశారని.. అయితే వైద్యులు ప్రయత్నించినప్పటికీ చిన్నారి ప్రాణాలు దక్కలేదని హర్బన్ లాల్ చెప్పాడు. కాగా కేక్‌లో విషపూరిత పదార్థాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు మేరకు పోలీసులు స్పందించారు. బేకరీ యజమానిపై కేసు నమోదు చేశారు.