నేడు నడ్డా సమక్షంలో బిజెపి లో చేరనున్న పంజాబ్ మాజీ సీఎం

నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ బిజెపి కండువా కప్పుకోబోతున్నారు. దేశ వ్యాప్తంగా బిజెపి పార్టీలోకి వలసలు ఆగడం లేదు. ఈ మధ్యనే గోవాలో ఏకంగా ఎనిమిది మంది కాంగ్రెస్ నేతలు చేరగా.. ఇప్పుడు పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ బిజెపి తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈరోజు (సోమవారం)న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరనున్నారు.

గతేడాది సెప్టెంబరులో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అమరీందర్ సింగ్ ఆ తర్వాత కాంగ్రెస్‌ను వీడారు. అప్పుడే ఆయన బీజేపీలో చేరబోతున్నట్టు ప్రచారం జరిగినా ఆయన దానిని ఖండించారు. ఆ తర్వాత పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్‌సీ)ని స్థాపించారు. ఆ తర్వాత పంజాబ్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆయన పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. పాటియాలా అర్బన్ నుంచి బరిలోకి దిగిన అమరీందర్ సింగ్ ఆప్ అభ్యర్థి చేతిలో 19,873 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన తన పార్టీని బీజేపీలో విలీనం చేయాలని నిర్ణయించుకున్నారు.

నేడు ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకోబోతున్నారు. అమరీందర్ సింగ్‌తోపాటు ఆయన పార్టీ పీఎల్‌సీలో చేరిన ఏడుగురు మాజీ ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ కూడా నేడు కాషాయ కండువా కప్పుకోబోతున్నారు.