ప్రముఖ సీనియర్ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ కన్నుమూత
ప్రముఖ సీనియర్ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ (84) కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో మంగళవారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. పబ్లిసిటీ డిజైనర్గా కెరీర్ ప్రారంభించిన ఆయన 2550 పైగా సినిమాలకు పబ్లిసిటీ డిజైన్స్ అందించారు. బాపు దర్శకత్వంలో రూపొందిన సాక్షి సినిమాతో పబ్లిసిటీ పనులు స్టార్ట్ చేశారు. ఈ సినిమా కలర్ పోస్టర్స్, లోగోను ఈశ్వర్ రూపొందించారు. నైఫ్ వర్క్తో పోస్టర్స్ను రూపకల్పన చేసి తన ప్రత్యేకతను చాటుకున్నారు. అగ్ర హీరోల సినిమాలకు కూడా పబ్లిసిటీ డిజైన్స్ రూపొందించిన ఆయన.. సౌత్ ఇండియన్ పబ్లిసిటీ డిజైనర్ సంఘ అధ్యక్షుడిగానూ పని చేశారు.
రఘుపతి వెంకయ్ నాయుడు పురస్కారం అలాగే ఉత్తమ చలన చిత్ర పుస్తక విభాగంలో ఆయన రాసిన పుస్తకానికి నంది అవార్డ్ దక్కింది. ఈశ్వర్ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు. వంశ పారపర్యంగా వస్తున్న బొమ్మలు గీసే వృత్తిలోకి ఆయన ప్రవేశించారు. బొమ్మలు గీయడంలో ఉండే ఆసక్తితో కాకినాడ పాలిటెక్నిక్ చదువును ఆపేశారు. పబ్లిసిటీ ఆర్టిస్ట్గా స్థిరపడాలనే స్నేహితుడు సహాయంతో మద్రాసు చేరుకున్నారు. మద్రాసు చేరుకున్న తర్వాత కేతా వద్ద పోస్టర్ డిజైనింగ్లో మెళుకువలు నేర్చుకున్నారు. తన పేరు ఈశ్వర్తోనే పబ్లిసిటీ కంపెనీని స్టార్ట్ చేసి అంచలంచలుగా ఎదిగారు. ఈశ్వర్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.