రాష్ట్రపతి నిలయంలో ఎట్‌ హోమ్..సీఎం దంపతులు హాజరు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రస్తుతం తెలంగాణ పర్యటనలో బిజీ ..బిజీ గా గడుపుతున్న సంగతి తెలిసిందే. శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌ వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసైతో పాటు.. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే దంపతులు హాజరయ్యారు. రాష్ట్రపతి ముర్ము, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూర్చొని సరదాగా మాట్లాడుకున్నారు.

బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి కూడా విందులో పాల్గొన్నారు. ఎమ్మెల్సీలు, ఎంపీలు, సీఎస్ శాంతికుమారి తదితరులు రాష్ట్రపతి ఎట్ హోంకు హాజరయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రతి ఒక్కరిని కలిశారు. అందరు కలసి కాసేపు మాట్లాడారు. అనంతరం ఫొటోలు దిగారు.