నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో కెసిఆర్ మోసం చేశారుః జవదేకర్ ఆగ్రహం

కెటిఆర్, కవిత, హరీశ్‌రావు, సంతోష్‌కు తప్ప మరెవరికీ ఉద్యోగాలు రాలేదని విమర్శ

prakash javadekar
prakash javadekar

న్యూఢిల్లీః తెలంగాణలోని అధికార బిఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జ్ జవదేకర్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అవినీతి, విశ్వాసఘాతుకం తప్ప ఏముందని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఇతర నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో సిఎం కెసిఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. మొత్తంగా కుటుంబ పాలన తీసుకొచ్చారని విమర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 18 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని చెప్పి లక్ష ఎకరాలకు మాత్రమే సాగునీరు ఇచ్చారన్నారు. తెలంగాణకు నీళ్లొస్తాయన్న ఉద్దేశంతో తాను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు 15 రోజుల్లోనే ప్రాజెక్టుకు అనుమతి మంజూరు చేసినట్టు గుర్తు చేశారు. రూ. 40 వేల కోట్ల అంచనాతో ప్రాజెక్టును ప్రారంభించి చివరికి రూ.1.20 లక్షల కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు.

అప్పులకైతే లేక్కే లేదని, ప్రభుత్వం రూ. 3.61 లక్షల కోట్లు అప్పు చేస్తే, ప్రభుత్వ గ్యారెంటీ అప్పులు రూ. 1.55 లక్షల కోట్లకు చేరాయని వివరించారు. కెసిఆర్ కుటుంబంలో కెటిఆర్, కవిత, హరీశ్‌రావు, సంతోష్‌కు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని, మరెవరికీ రాలేదని మండిపడ్డారు. ఈ నెల 27న బిజెపిలో పెద్దసంఖ్యలో నేతలు చేరబోతున్నట్టు ప్రకాశ్ జవదేకర్ తెలిపారు.