బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కి మంత్రి పొన్నం కౌంటర్

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ డ్రామాలు ఆడుతున్నాయని, సీబీఐ దర్యాప్తు చేయించకుండా గత బీఆర్ఎస్ పాలకులను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తోందని కిషన్ రెడ్డి అన్నారు.

దీనిపై పొన్నం ప్రభాకర్ స్పందించారు. కేసీఆర్ ప్రతిపాదిత బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అనేక చిలకపలుకులు పలుకుతున్నారని, కేసీఆర్ స్క్రిప్ట్ నే కిషన్ రెడ్డి చదివి వినిపించారని ఎద్దేవా చేశారు. దీని ద్వారా రాబోయే ఎన్నికల్లో లబ్ధి చేకూరుతుందనే ఇలా మాట్లాడుతున్నారని కానీ అటువంటిదేమీ జరగదన్నారు. కిషన్ రెడ్డి కోరుతున్నట్లుగా సీబీఐ దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సీబీఐ అనేది కేంద్ర సంస్థ ఆధ్వర్యంలో పని చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినా రాయకపోయినా కేంద్ర మంత్రి హోదాలో కేంద్ర పెద్దలకు లేఖ రాసి సీబీఐ దర్యాప్తును చేయించవచ్చన్నారు. కేంద్రంలో బీజేపీనే అధికారంలో ఉన్నప్పటికీ ఎంక్వయిరీకి మేమే అడ్డుపడుతున్నట్లుగా కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారని … కానీ కేసీఆర్‌ను రక్షించేందుకే కిషన్ రెడ్డి సీబీఐ ఎంక్వయిరీ కోరుతున్నారని ధ్వజమెత్తారు.