కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు నేడు పొంగులేటి ప్రకటించనున్నారా..?

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న ఈ విషయం ఆయన నేరుగా అధికారిక ప్రకటన చేయలేదు. ఆ ప్రకటన ఎప్పుడెప్పుడు చేస్తారా అని యావత్ కాంగ్రెస్ శ్రేణులు ఎదురుచూస్తున్నారు. అయితే ఆ సమయం వచ్చిందని , ఈరోజు ఆ ప్రకటన చేయబోతారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈరోజు కాంగ్రెస్‌లో చేరికపై అనుచరులతో కలిసి అధికారికంగా ప్రకటించనున్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. దీనికోసం ఇప్పటికే ముఖ్య అనుచరులతో మాట్లాడడం జరిగింది. ఈరోజు హైదరాబాద్‌కు రావాలంటూ అనుచరులకు ఫోన్లు చేశారు. ప్రకటన తర్వాత నియోజక వర్గానికి ఇద్దరు చొప్పున తన అనుచరులతో కలిసి పొంగులేటి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈరోజు మధ్యాహ్నం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తో పొంగులేటి , జూపల్లి సమావేశం కానున్నారు. రేవంత్‌తో భేటీ తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు అధికారికంగా ప్రకటించనున్నారు.

మరోపక్క అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ .. టూర్‌ను ముగించుకుని 22న ఢిల్లీకి చేరుకోనున్నారు. రాహుల్ ఢిల్లీకి రాగానే తమ అనుచరులతో కలిసి ఢిల్లీ వెళ్లనున్నారు పొంగులేటి, జూపల్లి. అక్కడ రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం.