రాజకీయ నాయకులు తమపై వచ్చే అన్ని విమర్శలకు అతిగా స్పందించొద్దుః సుప్రీంకోర్టు

Supreme Court

న్యూఢిల్లీః రాజకీయ నాయకులు తమపై వచ్చే అన్ని విమర్శలకు అతిగా స్పందించరాదని, కొన్నింటిని పట్టించుకోకపోవడమే ఉత్తమమని సుప్రీంకోర్టు పేర్కొంది. న్యాయమూర్తులు కూడా తమపై వచ్చే ఆరోపణలు, విమర్శల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అదే సమయంలో వాటన్నింటినీ పట్టించుకోరాదని జస్టిస్‌ బి.ఆర్‌.గవాయి, జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌ సభ్యులుగా ఉన్న ధర్మాసనం అభిప్రాయపడింది. ఇలాంటి విషయాలకు స్పందిస్తూ పోతే మన పని మనం చేసుకోలేమని తెలిపింది.

ప్రస్తుత రోజుల్లో ఇంటర్వ్యూల్లో విమర్శలు చేయడం సాధారణ వ్యవహారంగా మారిందని సుప్రీం కోర్టు చెప్పింది. అసోం ప్రభుత్వం తనపై అనేక కేసులు నమోదు చేసిందని, అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ బంగాల్​కు చెందిన రాజకీయ వ్యాఖ్యాత గర్గా ఛటర్జీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది. 2022 సెప్టెంబరు 9న సుప్రీంకోర్టు రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులిచ్చిన విషయాన్ని ధర్మాసనం అడిగిన ఓ ప్రశ్నకు పిటిషనర్‌ సమాధానంగా తెలిపారు. కేసులో తుది వాదనల కోసం విచారణ వాయిదా పడింది.