పదో తరగతి హిందీ పేపర్ లీకేజీని ఛేదించిన పోలీసులు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పదో తరగతి హిందీ పేపర్ లీక్ కేసును పోలీసులు ఛేదించారు. ఫ్రెండ్ కోసం ఈ లీక్ ఘటనకు పాల్పడినట్లు సీపీ రంగనాథ్ తెలిపారు. కమలాపూర్ బాయ్స్ హై స్కూల్ లో ఈ ఘటన జరిగిందని, పరీక్ష కేంద్రంలోకి 16 ఏళ్ల బాలుడు దూకి కిటికీ పక్కన పరీక్ష రాస్తున్న ఓ విద్యార్థి క్వషన్ పేపర్ ను ఫోటో తీసి పాఠశాల వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేసినట్లు తెలిపారు.

వరంగల్ జిల్లా ఉప్పల్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్ష రాస్తున్న తన మిత్రుడికి పరీక్షలో సహాయం అందించడం కోసం కమలాపూర్ ప్రభుత్వ బాలుర పాఠశాల గోడ దూకి కిటికి ప్రక్కనే పరీక్ష రాస్తున్న బాలుడి నుండి హిందీ పరీక్ష పత్రాన్ని ఉదయం 9.45 నిమిషాలకు ఫోటో తీశాడని తెలిపారు. హిందీ పేపర్ ను మరో నిందితుడైన మౌటం శివ గణేష్ కు వాట్సాప్ నెంబర్ కు పోస్ట్ చేశాడని తెలిపారు. అనంతరం రెండో నిందితుడైన మౌటం శివ గణేష్ ఉదయం 9.59 నిమిషాలకు తన సెల్ఫోన్ ద్వారా ఎస్.ఎస్.సి 2019-20 అనే వాటప్స్ గ్రూప్ లో ఫార్వడ్ చేశారని వెల్లడించారు. మూడవ నిందితుడు ప్రశాంత్ సెల్ ఫోన్ కు ఎస్.ఎస్.సి 2019-20 గ్రూప్ నుండి ప్రశ్న పత్రం రావడంతో ఈ ప్రశ్న పత్రాన్ని నిందితుడు ప్రశాంత్ వివిధ గ్రూపులకు ఫార్వార్డ్ చేసినట్లు తెలిపారు.