జీ20 డ్యూటీ పోలీసు సిబ్బందితో కలిసి విందు ప్లాన్ చేస్తున్న ప్రధాని మోడీ
న్యూఢిల్లీః భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలోని భారత్ మండపంలో ఆదివారం విజయవంతంగా ముగిసిన విషయం తెలిసిందే. కాగా, ఈ సమ్మిట్ను విజయవంతం చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఢిల్లీ పోలీసులకు ప్రధాని మోడీ ప్రత్యేక విందు ప్లాన్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ప్రతి జిల్లా నుంచి కానిస్టేబుళ్ల నుంచి ఇన్స్పెక్టర్ల వరకూ శిఖరాగ్ర సమావేశంలో అద్భుతమైన పని కనబరచిన సిబ్బంది జాబితాను ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా కోరినట్లు తెలిపారు. అరోరా సహా మొత్తం 450 మంది సిబ్బంది ఈ విందులో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ వారంలోనే జీ20 సమ్మిట్ జరిగిన భారత్ మండపంలో ఈ విందు ఉండే అవకాశం ఉన్నట్లు వర్గాలు వెల్లడించాయి.