సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ
హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ ముచ్చింతల్లో సమతామూర్తి విగ్రహాన్ని నేడు సాయంత్రం 6:30 గంటలకు ఆవిష్కరించారు. సమతామూర్తి విగ్రహాన్ని జాతికి అంకితం చేసిన అనంతరం మోడీ రామానుజాచార్యులకు నమస్కరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, చిన్నజీయర్ స్వామి, మైం హోం గ్రూప్స్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
కాగా, సమతామూర్తి విగ్రహావిష్కరణకు కంటే ముందు 108 దివ్య దేశాల(వైష్ణవ ఆలయాలు)ను మోడీ సందర్శించారు. ఈ సందర్భంగా మోడీ కి చిన్నజీయర్ స్వామి దివ్య దేశాల విశిష్టతను వివరించారు. ఈ సాయంత్రం నిర్వహించిన విష్వక్సేనేష్టి యాగంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. యాగంలో పాల్గొన్న మోడీకి పండితులు ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా మోడీకి చిన్నజీయర్ స్వామి ఓ కంకణాన్ని బహుకరించారు. అనంతరం యాగశాల చుట్టూ మోడీ ప్రదక్షిణలు చేశారు. మోడీ బంగారు వర్ణం దుస్తులు ధరించి యాగానికి హాజరయ్యారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/