చికోటి ప్రవీణ్ తో వైస్సార్సీపీ నేతలకు సంబంధం ఉంది – వర్ల రామయ్య

చికోటి ప్రవీణ్ ..ప్రస్తుతం ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతుంది. సాధారణ పేకాట స్థావరాలను నడిపించే ప్రవీణ్..ఇప్పుడు దేశ , విదేశాల్లో క్యాసినోలను నిర్వహించే స్థాయికి చేరాడు. అతి కొద్దీ ఏళ్లలోనే వందల కోట్లను సంపాదించాడు. దీంతో ఈడీ అధికారులు చికోటి ప్రవీణ్ తో పాటు మాధవరెడ్డి ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ దాడులు నిర్వహించింది. మొత్తం 8 ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. గురువారం (జూలై 28) తెల్లవారుజాము వరకు ఏకధాటిగా 20 గంటల పాటు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. చీకోటి ప్రవీణ్ ఇంట్లో సోదాలు చేసిన ఈడీ అధికారులు క్యాసినో ద్వారా జరిగిన హవాలా లావాదేవీలు మాత్రమే కాకుండా బంగారం దందా వ్యవహారంలోనూ అతడికి సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. అంతే కాదు ప్రముఖులు, సెలబ్రిటీలతో ప్రవీణ్‌కు సంబంధాలున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసారు. సోమవారం విచారణ కు రావాలని ఆదేశాలు జారీ చేసారు.

ఇదిలా ఉంటె చికోటి ప్రవీణ్ కు వైస్సార్సీపీ నేతలకు సంబంధం ఉన్నట్లు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. గత సంక్రాంతి పండుగ సందర్బంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ నేతృత్వంలో గుడివాడలో చికోటీ ప్రవీణ్ క్యాసినో నిర్వహించి ప్రజలను నిలువు దోపిడి చేశారని ఆరోపించారు వర్ల రామయ్య. తాజాగా ఆయన మాట్లాడుతూ.. చికోటి ప్రవీణ్ ఇప్పడు నేపాల్ లో నిర్వహించిన క్యాసినోలో వేల కోట్ల హవాలా ధనం చేతులు మారినట్లు గుర్తించి ఈడీ సోదాలు జరిపిందని, నేపాల్ క్యాసినోకి రాష్ట్రం నుంచి వేలాది మంది వెళ్లారన్నారు. ఇందులో సగం మంది అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలున్నారని అంటున్నారని, వారి నుంచి ఒక్కక్కరికి దగ్గర చికోటి ప్రవీణ్ రూ.3 లక్షలు వసూలు చేసి మందు, విందు,సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారన్నారు.

క్యాసినో క్రీడతో వైస్సార్సీపీ నేతలు బ్లాక్ మనినీ వైట్ మనీగా మార్చుకుంటున్నారని, గుడివాడ క్యాసినో కేరళ నుంచి వచ్చిన పెద్దలు కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారన్నారు. దీనిపై కేరళ ప్రభుత్వం స్పందించినా జగన్ మాత్రం కనీసం విచారణ జరపలేదని, పైగా టీడీపీ నిజనిర్దారణ కమిటీపై అక్రమ కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు. చికోటి ప్రవీణ్‌తో వైస్సార్సీపీ నేతలకు సంబంధం ఉందని, వైస్సార్సీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ తదితర ఇళ్లలో కూడా ఈడీ సోదాలు జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు.