మోడీ గొప్ప దేశ భక్తుడు : రష్యా అధ్యక్షుడు పుతిన్

మోడీ నాయకత్వంలో భారత్ ఎంతో సాధించిందని ప్రశంస

pm-modi-a-patriot-and-a-lot-done-under-his-leadership

మాస్కో : రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత ప్రధాని మోడీ ని ‘అతి గొప్ప దేశ భక్తుడు’ అంటూ ప్రశంసించారు. మోడీ నాయకత్వంలో భారత్ ఎంతో సాధించిందని అన్నారు. ‘మేకిన్ ఇండియా’ అనేది మోడీ అద్భుతమైన ఆలోచన అని… ఇది ఆర్థికపరంగానే కాకుండా, నైతికపరంగా కూడా చాలా గొప్ప కార్యక్రమమని అన్నారు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఇండియా ఎంతో గర్విస్తోందని… ఆ దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని చెప్పారు. బ్రిటిష్ కాలనీ నుంచి ఒక సార్వభౌమాధికార దేశంగా భారత్ ఎంతో సాధించిందని అన్నారు.

భారత్ తో రష్యాకు ప్రత్యేకమైన బంధాలు ఉన్నాయని పుతిన్ చెప్పారు. ఎన్నో దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య బలమైన స్నేహం ఉందని అన్నారు. రెండు దేశాల మధ్య ఎప్పుడూ ఏ సమస్య కూడా రాలేదని… ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఇరు దేశాలు సహకరించుకుంటున్నాయని చెప్పారు. భవిష్యత్తులో కూడా రెండు దేశాలు ఇదే అనుబంధాన్ని కొనసాగిస్తాయని అన్నారు.

వ్యవసాయానికి సంబంధించిన ఫర్టిలైజర్స్ సరఫరాను పెంచాలని మోడీ తనను అడిగారని… ఆయన కోరిక మేరకు సరఫరాను 7.6 రెట్లు పెంచామని పుతిన్ వెల్లడించారు. వ్యవసాయానికి సంబంధించిన వ్యాపార లావాదేవీలు రెట్టింపయ్యాయని చెప్పారు. ఇదే సమయంలో పాశ్చాత్య దేశాలపై ఆయన విమర్శలు గుప్పించారు. ప్రపంచంపై ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ఆ దేశాలు ప్రయత్నిస్తుంటాయని… కానీ, రాబోయే రోజుల్లో ప్రపంచంలో కొత్త పవర్ సెంటర్లు తయారవుతాయని చెప్పారు.