మోడీ తో భేటీ కోసం విశాఖ చేరుకున్న పవన్ కల్యాణ్

ప్రధాని మోడీ రెండు రోజుల పాటు ఏపీలో పర్యటించబోతున్నారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ..ప్రధాని మోడీ తో సమావేశం కాబోతున్నారు. శుక్రవారం రాత్రి 8:30 నిమిషాలకు మోడీ.. పవన్ కళ్యాణ్ కు అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో, విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న పవన్ కు జనసేన శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అనంతరం పవన్ తన వాహనంలో నేరుగా నోవోటెల్ హోటల్ కు పయనమయ్యారు. ప్రధాని మోడీ తో భేటీ కోసం పవన్ వివిధ అంశాలపై కసరత్తులు చేసి ఐదు పేజీల నోట్ సిద్ధం చేసుకున్నాడని తెలుస్తోంది.

ప్రధానంగా, ఏపీలో బీజేపీతో పొత్తుపై పవన్ మరింత స్పష్టత కోరతారని భావిస్తున్నారు. కొన్ని రోజులుగా ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, బీజేపీలో కొందరు నేతల వైఖరిని ప్రధానికి పవన్ వివరిస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. శనివారం జరిగే ప్రధాని మోడీ బహిరంగ సభకు పవన్ హాజరయ్యే అవకాశం ఉందని జనసేన పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక శుక్రవారం విశాఖలో బీజేపీ నిర్వహించే ర్యాలీలో పవన్‌ పాల్గొంటారా? లేదా? అనేదానిపైనా ఇంకా స్పష్టత రాలేదు. పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.