ఓటీఎస్ పై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు : పెద్దిరెడ్డి

చంద్రబాబు రాజకీయాల్లో ఉండడం సిగ్గుచేటన్న మంత్రి పెద్దిరెడ్డి

అమరావతి : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ నేతలపై ధ్వజమెత్తారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ఓటీఎస్ పై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వంటి వ్యక్తి రాజకీయాల్లో కొనసాగడం సిగ్గుచేటని అన్నారు. వ్యవస్థలు, కుల వ్యక్తుల సాయంతో రాజకీయాలు చేయడం చంద్రబాబుకే సాధ్యమని విమర్శించారు. చంద్రబాబుకు చాతనైతే ప్రజల్లోకి వచ్చి తేల్చుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు డ్వాక్రా మహిళలను మోసం చేశారని, మండలిలో గ్యాలరీ ఎక్కి మరీ బెదిరించారని వెల్లడించారు.

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 11 మంది వైస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం కావడం తెలిసిందే. వారు ఇవాళ మండలి చైర్మన్ మోషేన్ రాజు కార్యాలయంలో ఎమ్మెల్సీలుగా పదవీప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి తాజా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేశ్ ఓటీఎస్ పై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పేదలు నిర్మించుకున్న ఇళ్లకు పట్టాలు లేవని, అందుకే 10 వేలు కడితే ఇళ్లు వారి పేరుపైనే రిజిస్ట్రేషన్ చేస్తామని చెబుతున్నామని వివరించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/