టీ 20 వరల్డ్ కప్ : పాక్ కు మరో ఓటమి

టీ 20 వరల్డ్ కప్ లో పాక్ జట్టు మరో ఓటమి చవిచూసింది. జింబాబ్వే చేతిలో ఒక్క పరుగు తేడాతో పాక్ ఓటమి చవిచూసింది. టీ 20 వరల్డ్ కప్ లో మొదటి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓటమి పాలైన పాక్.. రెండో మ్యాచ్ జింబాబ్వే చేతిలోనూ ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. 131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 129 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీంతో ఒకే ఒక్క పరుగు తేడాతో జింబాబ్వే ఘనవిజయం సాధించింది.

ఇక పాకిస్థాన్‌ బ్యాటింగ్‌ విషయానికొస్తే షాహన్‌ మసూద్‌ (44) తప్ప మరెవరూ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. మహ్మద్‌ నవాజ్‌ 22 పరుగులు, మహ్మద్‌ వసీమ్‌ 12 పరుగులు నాటౌట్‌ చేశారు. జింబాబ్వే బౌలింగ్‌లో సికందర్‌ రజా 3, బ్రాడ్‌ ఎవన్స్‌ 2 వికెట్లు తీశారు. జింబాబ్వే విజయంతో కీలకపాత్ర పోషించిన సికందర్ రాజాకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో పాకిస్తాన్ తన ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. దీంతో గ్రూప్-2 పాయింట్ల పట్టికలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ రోజు నెదర్లాండ్‌పై విజయంతో ఇండియా మొదటి స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే రెండు, మూడవ స్థానాల్లో ఉన్నాయి.