ఓయో ఫౌండ‌ర్ ఇంట విషాదఛాయలు

ఓయో రూమ్స్ వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ తండ్రి రమేష్ అగర్వాల్ కన్నుమూశారు. శుక్రవారం గురుగ్రామ్‌లోని ఎత్తైన భవనంపై నుంచి కిందపడి రమేష్ అగర్వాల్ మరణించారు. ఈ ఘటనపై గుర్గావ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. రమేష్ అగర్వాల్ తన భార్యతో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆ భవనంలోని 20వ అంతస్తు నుంచి కింద పడిపోవడంతో మృతిచెందారు. ప్రమాద సమయంలో కుటుంబ సభ్యులు కూడా ఇంట్లో ఉన్నారు. తన తండ్రి మరణ వార్తను రితేష్ అగర్వాల్ కూడా ధృవీకరించారు.

మా మార్గదర్శి, మా బలం, మా నాన్న రమేష్ అగర్వాల్ మార్చి 10న మరణించారని బరువెక్కిన హృదయంతో నేను, నా కుటుంబం తెలియజేయాలనుకుంటున్నాను. ఆయన తన జీవితమంతా ఉన్నత మార్గంలో గడిపారు. ప్రతిరోజూ మాలో చాలా మందికి స్ఫూర్తినిచ్చారు. ఆయన మరణం మా కుటుంబానికి తీరని లోటు. అత్యంత క్లిష్ట సమయాల్లో మమ్మల్ని ముందుకు తీసుకెళ్లడంలో నాన్న కరుణ, ఆప్యాయత కీలక పాత్ర పోషించాయి. ఆయన మాటలు మా హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఈ దుఃఖ సమయంలో ప్రతి ఒక్కరూ మా గోప్యతను గౌరవించాలని మేము అభ్యర్థిస్తున్నాము..’ అని రితేష్ అగర్వాల్ ఓ ప్రకటన విడుదల చేశారు.

రమేష్ అగర్వాల్ ఇటీవల తన 29 ఏళ్ల వ్యవస్థాపకుడు కుమారుడి వివాహం గీతాన్షా సూద్‌తో కనిపించాడు. ఈ జంట మార్చి 7న ఢిల్లీలోని ఫైవ్ స్టార్ తాజ్ ప్యాలెస్ హోటల్‌లో హై ప్రొఫైల్ వెడ్డింగ్ రిసెప్షన్‌ను నిర్వహించారు.