సిబ్బందిని బెదిరించి 25 కిలోల బంగారం దోపిడీ

లూధియానా: పంజాబ్ లో భారీ దోపిడీ ఘటన జరిగింది. లూధియానాలో ఉన్న ఐఐఎఫ్ఎల్ (ఇండియా ఇన్ఫోలైన్ ఫైనాన్స్ లిమిటెడ్) గోల్డ్ లోన్ సంస్థ బ్రాంచిలో ముసుగులతో ప్రవేశించిన ముగ్గురు దొంగలు సిబ్బందిని బెదిరించి భారీగా బంగారం ఎత్తుకెళ్లారు. లూధియానాలోని గిల్ రోడ్డులో ఉన్న ఐఐఎఫ్ఎల్ బ్రాంచి వద్దకు ఉదయం ఓ కారు వచ్చింది. అందులోని ఐదుగురిలో ఒకరు కారులోనే ఉండగా, మరో నలుగురు గోల్డ్ లోన్ కార్యాలయంలో ప్రవేశించి సిబ్బందిని బెదిరించి తాళ్లతో బంధించారు. వారినుంచి బంగారం దాచిన గది తాళాలు తీసుకుని అందులో ఉన్న 25 కిలోల బంగారు ఆభరణాలు దోచుకున్నారు. కేవలం 20 నిమిషాల్లో వచ్చిన పని పూర్తి చేసుకున్న దుండగులు అక్కడి నుంచి మాయమయ్యారు. వారు వెళ్లిన తర్వాత కాసేపటికి తేరుకున్న ఐఐఎఫ్ఎల్ సిబ్బంది అలారం మోగించారు. కాగా, దోపిడీ జరిగిన సమయంలో ఐఐఎఫ్ఎల్ భద్రతా సిబ్బంది అక్కడ లేకపోవడం గమనార్హం. ఈ భారీ దోపిడీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/