అచ్యుతాపురం గ్యాస్‌ లీక్‌..కంపెనీ మూసివేతకు ఆదేశాలు : ఏపీ మంత్రి

orders-to-shut-down-company-in-case-of-toxic-gas-leak-ap-minister

అమరావతిః ఏపిలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం స్పెష‌ల్ ఎక‌న‌మిక్ జోన్ (సెజ్‌)లో ఉన్న సీడ్స్‌ దుస్తుల కంపెనీలో మరోమారు విషవాయువు లీకైలీకై అస్వస్థకు గురైన 95 మంది మహిళా కార్మికులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం విదితమే. అయితే బాధితులను ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్‌ పరామర్శించారు. సీడ్స్‌ కంపెనీ మూసేయాలని ఆదేశించామని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ చేయిస్తామని, సీడ్స్‌ కంపెనీకి నోటీసులు ఇచ్చామని, తప్పు జరిగితే ఎవరైనా ఒప్పుకోవాల్సిందేనని తెలిపారు. ఇదే కంపెనీలో అంతకుముందు కూడా గ్యాస్‌ లీకైందని మంత్రి వెల్లడించారు.

అప్పుడు ఏసీ డెక్‌లలో క్రిమి సంహారక మందులు కలవడం వల్ల కాలుష్యం లీకై గ్లోరిఫై పాలీస్‌ అనే రసాయనం వెలువడినట్లు తెలిసిందని వివరించారు. ఈసారి కారణం నిర్ధారణ కావాల్సి ఉందని అన్నారు. యాదృచ్ఛికమా లేదా ఉద్దేశపూర్వం చర్యా అనేది తేలాలని అన్నారు. పరిశ్రమలకు సేఫ్టీ ఆడిట్‌ లేకపోతే కంపెనీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌కు నమూనాలు పంపుతున్నామని మంత్రి అమర్నాథ్‌ తెలిపారు. ఇదిలా ఉండగా రసాయనాలు లీకైన సీడ్స్‌ కంపెనీలో అధికారులు ఇవాళ నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తెలిపారు. అక్కడి నుంచి వచ్చే నివేదిక అనంతరం వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/