మణిపూర్ అంశంపై ప్ర‌ధాని మోడీ ప్ర‌క‌ట‌న చేయాలి..విపక్షాల నిర‌స‌న గ‌ళం

opposition-parties-protest-in-parliament-demanding-pm-modi’s-statement-on-manipur-in-both-houses

న్యూఢిల్లీ: ప్ర‌ధాని మోడీ మ‌ణిపూర్‌లో జ‌రిగిన హింసాకాండ పై పార్ల‌మెంట్‌లో ప్ర‌క‌ట‌న చేయాల‌ని విప‌క్షాలు డిమాండ్ చేశాయి. ఈ నేప‌థ్యంలో నేడు పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టాయి. లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌ల్లోనూ ప్ర‌ధాని మోడీ మ‌ణిపూర్ అంశంపై ప్ర‌క‌ట‌న చేయాల‌ని డిమాండ్ చేశాయి. ఇద్ద‌రు మ‌హిళ‌ల్ని న‌గ్నంగా ఊరేగించిన ఘ‌ట‌న‌పై ఎన్సీపీ ఎంపీ సుప్రీయా సూలే స్పందించారు. ఇది మ‌హిళ‌ల స‌మ‌స్య అని, ఇది రెండు రాష్ట్రాల మ‌ధ్య పోటీ కాదు అని, ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి ఘ‌ట‌న జ‌రగకూడ‌ద‌ని ఆమె అన్నారు.

మ‌ణిపూర్‌లో జ‌రిగిన క్రూర ఘ‌ట‌న చాలా డిస్ట‌ర్బింగ్‌గా ఉంద‌ని టీఎంసీ ఎంపీ అభిషేక్ బెన‌ర్జీ తెలిపారు. ఈ అంశంపై ప్ర‌ధాని మోడీ స‌భ‌లో మాట్లాడేందుకు వెనుకాడుతున్నార‌న్నారు. ఈ అంశాన్ని దృష్టి మ‌ళ్లించేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంద‌న్నారు. డ‌బుల్ ఇంజిన్ స‌ర్కార్ అస‌మ‌ర్థ పాల‌న చేస్తోంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. పార్ల‌మెంట్ బ‌య‌ట ప్ర‌క‌టన చేయ‌డం కాదు అని, ఉభ‌య‌స‌భ‌ల్లోనూ ప్ర‌ధాని మోడీ మ‌ణిపూర్ అంశంపై ప్ర‌క‌ట‌న చేయాల‌ని రాజ్య‌స‌భ ఎంపీ మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే అన్నారు.

ఈరోజు లోక్‌స‌భ ప్రారంభ‌మైన త‌ర్వాత విప‌క్షాలు నినాదాలు చేశాయి. మ‌ణిపూర్ అంశాన్ని చ‌ర్చించాల‌ని ప‌ట్టుప‌ట్టాయి. స్పీక‌ర్ ఓం బిర్లా ప్ర‌శ్నోత్త‌ర కార్య‌క్ర‌మాన్ని కొన‌సాగించారు. ఆ స‌మ‌యంలో విప‌క్ష ఎంపీలు ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శిస్తూ నినాదాలు చేశారు. మ‌రో వైపు నిర‌స‌నల నేప‌థ్యంలో రాజ్య‌స‌భ‌ను 12 గంట‌ల వ‌ర‌కు వాయిదా వేశారు.