ఈ నెల 23న పాట్నాలో విపక్ష నేతల సమావేశం

15 పార్టీలకు చెందిన ప్రధాన నేతలు హాజరు..కెసిఆర్ గురించి లేని స్పష్టత: తేజశ్వి యాదవ్

Opposition meeting to be held in Patna on June 23

న్యూఢిల్లీః వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బిజెపిని ఓడించేందుకు విపక్షాలు ఒక్కటయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నెల 23న పాట్నాలో విపక్ష నేతలు సమావేశమవుతున్నారు. బీహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్, బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ లు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తేజశ్వి యాదవ్ మాట్లాడుతూ.. 15 పార్టీలకు చెందిన ప్రధాన నేతలు ఈ సమావేశానికి హాజరవుతున్నారని తెలిపారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ విషయంలో మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. కెసిఆర్ తో మాట్లాడలేదని అన్నారు. 2024 ఎన్నికల విషయంలో బిజెపి భయపడుతోందని చెప్పారు.

గత కొన్ని నెలలుగా నితీశ్ కుమార్, తేజశ్వి యాదవ్ లు వివిధ రాష్ట్రాల్లో పర్యటించి విక్షాలను ఏకం చేసేందుకు తమ వంతు ప్రయత్నం చేశారు. మరోవైపు జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ… మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, హేమంత్ సొరేన్, ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్, స్టాలిన్, కేజ్రీవాల్, డి.రాజా, సీతారామ్ ఏచూరి, దీపాంకర్ భట్టాచార్యలు సమావేశానికి హాజరవుతున్నారని వెల్లడించారు.