ఎమ్మెల్యే రాజాసింగ్కు మరోసారి పోలీసులు నోటీసులు

rajasingh

గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్కు మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. జనవరి 29న ముంబైలోని దాదర్లో జరిగిన ఓ ర్యాలీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. హైకోర్టు విధించిన షరతులను రాజాసింగ్ ఉల్లంఘించారని.. రెండు రోజుల్లో వీటిపై సమాధానం చెప్పాలని నోటీసులో స్పష్టం చేశారు. ఈ నోటీసులపై రాజాసింగ్ స్పందించారు. రాష్ట్రాన్ని ఎనిమిదో నిజాం పాలిస్తున్నారని విమర్శించారు. నిజాం పాలనకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని.. పోలీసులు జైలుకు పంపినా భయపడేది లేదని స్పష్టం చేశారు.

ధర్మం కోసం చావడానికైనా సిద్ధమని , గోహత్య, మతమార్పిడులు, లవ్ జీహాద్పై చట్టం తీసుకురావాలని డిమాండ్ చేయడం మతవిద్వేషాలను రెచ్చగొట్టడమా అని ప్రశ్నించారు. ముంబైలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడితే మంగళహట్ పోలీసులు నోటీసులు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. గతేడాది అజ్మీర్ దర్గాపై ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారని , కంచన్ భాగ్ పోలీస్ స్టేషన్ లో రాజాసింగ్ ఫై కేసు నమోదు అయింది. ఆ తరువాత ఈ కేసును కంచన్ భాగ్ నుండి మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో మంగళ్ హాట్ పోలీసులు జనవరి 20న 41A CRPC కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు.