కేరళ పాలక్కాడ్లో ఘోర ప్రమాదం..9 మంది మృతి
దసరా వేళ కేరళ పాలక్కాడ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. గురువారం అర్ధరాత్రి సమయంలో పాలక్కాడ్ జిల్లా వడక్కంచేరి వద్ద పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న టూరిస్ట్ బస్సు ప్రమాదానికి గురైంది. వడకంచెరి జాతీయ రహదారిపై KSRTC బస్సు, టూరిస్ట్ బస్సు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 9మంది మృతి చెందగా..మరో 45మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో మరో 10మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఎర్నాకుళానికి చెందిన ఓ బృందం ఊటీకి విహార యాత్రకు వెళ్లిన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. టూరిస్ట్ బస్సులో ఐదుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు, కెఎస్ఆర్టిసి బస్సులోని ముగ్గురు ప్రయాణికులు మరణించారు. కేఎస్ఆర్టీసీ బస్సు వెనుక ప్రయాణిస్తున్న కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రులకు తరలించారు. టూరిస్ట్ బస్సు వడక్కంచేరి వద్ద వేగంగా వెళ్లి.. కేఎస్ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.