నీట్‌ పరీక్ష సెప్టెంబర్‌ 12కు వాయిదా

నేటి నుంచి దరఖాస్తులు

న్యూఢిల్లీ: వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ పరీక్ష వాయిదా పడింది. ఆగస్టు 1న పరీక్ష జరుగాల్సి ఉండగా దానిని సెప్టెంబర్‌ 12న నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సోమవారం ప్రకటించారు. నీట్‌ దరఖాస్తు ప్రక్రియ మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభం కానుంది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ధర్మేంద్ర ప్రధాన్‌ ట్వీట్‌ చేశారు.

పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అధికారులే మాస్కులు అందజేస్తారని తెలిపారు. విద్యార్థులు భౌతిక దూరం పాటిస్తూ పరీక్షలు రాసేందుకు పరీక్ష నిర్వహించే నగరాల సంఖ్యను 155 నుంచి 198కి పెంచినట్టు పేర్కొన్నారు. అలాగే 3,862గా ఉన్న పరీక్ష కేంద్రాలను కూడా పెంచనున్నట్టు ప్రకటించారు. తెలుగు సహా 11 భాషల్లో పరీక్షను నిర్వహిస్తారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/