సరోగసి వివాదంలో అసలు నిజం బయటపెట్టిన నయన్ దంపతులు
నయనతార , విఘ్నేష్ శివన్ దంపతులు సరోగసి ద్వారా ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్నీ ప్రకటించిన దగ్గరి నుండి సోషల్ మీడియా లో అంత దీనిగురించి మాట్లాడుకుంటున్నారు. అయితే నయనతార సరోగసి అంశంపై వివాదం నెలకొంది. తమకు పిల్లలు ఎలా పుట్టారో వివరణ ఇవ్వాలంటూ తమిళనాడు ప్రభుత్వం నయన్ దంపతులకు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో నయన్ దంపతులు ఓ కీలక విషయాన్నీ బయటపెట్టినట్లు తెలుస్తుంది.
తమ వివాహాన్ని ఆరేళ్ల క్రితమే రిజిస్టర్ చేసుకున్నట్టు అఫిడవిట్ సమర్పించారు. సరోగసీ విధానంలో కవలలకు జన్మనివ్వడంపై వస్తున్న విమర్శలకు అఫిడవిట్ రూపంలో పుల్ స్టాప్ పెడదామన్నది దంపతుల ప్రయత్నంగా కనిపిస్తోంది. తమిళనాడు వైద్య శాఖ ఏర్పాటు చేసిన కమిటీకి తమ వివాహ సర్టిఫికెట్, అఫిడవిట్ ను విఘ్నేశ్, నయన్ సమర్పించినట్టు తెలిసింది.
విఘ్నేశ్, నయనతార 2015 నుంచి ప్రేమించుకుంటూ, సహ జీవనం కూడా చేశారు. ఈ విషయం అభిమాన లోకానికి ఎప్పటి నుంచో తెలుసు. కానీ అధికారికంగా వీరు ఈ ఏడాది జూన్ 9న వివాహం చేసుకున్నారు. అక్టోబర్ 9న కవలలకు తల్లిదండ్రులయ్యారు. సరోగసీ చట్టం ప్రకారం పెళ్లయి ఐదేళ్ల వరకు పిల్లలు లేకపోతేనే ఈ విధానానికి అర్హులు.