అవి వ్యక్తులు చేసిన అభిప్రాయాలే .. భారత ప్రభుత్వానివి కావు

భారత్ అన్ని మతాలను గౌరవిస్తుందన్న విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

అమరావతి : మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఇస్లామిక్ దేశాల సమాఖ్య (ఓఐసీ) జనరల్ సెక్రటరీ భారత్ విషయంలో చేసిన వ్యాఖ్యలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. అనుచితం, సంకుచిత ధోరణితో చేసిన వ్యాఖ్యలుగా అభివర్ణించింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బాగ్చి దీనిపై ప్రకటన చేశారు. “ఇస్లామిక్ దేశాల సమాఖ్య జనరల్ సెక్రటేరియట్ భారత్ పట్ల చేసిన వ్యాఖ్యలను చూశాం. ఓఐసీ జనరల్ సెక్రటేరియట్ అనుచితమైన, సంకుచిత మనస్తత్వంతో చేసిన వ్యాఖ్యలను భారత ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తోంది. భారత్ అన్ని మతాలకు సుముచిత గౌరవం ఇస్తుంది.

మతపరమైన వ్యక్తిత్వాన్ని కించపరిచే వ్యాఖ్యలు, ట్వీట్లు కొంతమంది వ్యక్తులు చేసినవి. అవి ఎంత మాత్రం భారత ప్రభుత్వ అభిప్రాయాలు కావు. సదరు వ్యక్తులపై ఆయా సంస్థలు (బీజేపీ) కఠిన చర్యలు తీసుకున్నాయి. ఓఐసీ సెక్రటేరియట్ మరోసారి ప్రేరేపించే, తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలను ఎంచుకోవడం విచారకరం. ఇది స్వార్థ ప్రయోజనాల కోణంలో వారి విభజన అజెండాను స్పష్టం చేస్తోంది ఐవోసీ సెక్రటేరియట్ మతపరమైన విధానం అనుసరించడం ఆపాలని భారత్ కోరుతోంది. అన్ని విశ్వాసాలను, మతాలను గౌరవించాలి’’ అని బాగ్చి ప్రకటించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ పై బీజేపీ ఇప్పటికే చర్యలు ప్రకటించడం గమనార్హం.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/