ఆర్టీసీ డ్రైవర్ పై దాడి.. వైఎస్‌ఆర్‌సిపి అరాచకానికి నిదర్శనం: నాదెండ్ల మనోహర్

కొత్త చట్టాలు తెస్తారేమోనని సందేహంగా ఉందన్న నాదెండ్ల మనోహర్

nadendla manohar
nadendla manohar

అమరావతిః పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి వద్ద ఓ ఆర్టీసీ డ్రైవర్ పై కొందరు వ్యక్తులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడడం తెలిసిందే. రోడ్డుపై బైక్ నిలిపి ఉంచడంతో హారన్ కొట్టిన నేరానికి ఆ డ్రైవర్ పై దాడి చేశారు. ఈ ఘటనపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు.

వైఎస్‌ఆర్‌సిపి అరాచకానికి కావలి ఘటనే నిదర్శనమని విమర్శించారు. వైఎస్‌ఆర్‌సిపి అధికారంలోకి వచ్చాక అరాచకం అనే మాట తప్ప అభివృద్ధి అనే మాట ఎక్కడా వినిపించడంలేదని పేర్కొన్నారు. అధికార దుర్వినియోగం, అందుకు అహంకారం కూడా తోడవడంతో వైఎస్‌ఆర్‌సిపిలో ప్రతి స్థాయి నాయకుడు ప్రజల మీద, ఉద్యోగుల మీద జులుం చేస్తున్నారని నాదెండ్ల మండిపడ్డారు.

నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని మద్దూరుపాడు జంక్షన్ వద్ద ఆర్టీసీ డ్రైవర్ పై దాడి ఘటన చూస్తే వైఎస్‌ఆర్‌సిపి అరాచకం ఏ విధంగా పెచ్చరిల్లుతోందో అర్థమవుతోందని తెలిపారు.

“రోడ్డుకు అడ్డంగా ఉన్న మోటార్ సైకిల్ తీయమని హారన్ మోగించడమే ఆ ఆర్టీసీ డ్రైవర్ చేసిన నేరమా? ఆ బస్సును వెంబడించి మరీ విచక్షణ రహితంగా దాడి చేయడం, ఆ అరాచకాన్ని చిత్రీకరించిన వారిని బెదిరించడం చేశారంటే… అలాంటి గూండాలకు బలమైన అండ ఉండడమే కారణం అనిపిస్తోంది” అని పేర్కొన్నారు.

విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. ఈ ఘటనకు కారకులైన వారిని అరెస్ట్ చేయడంలో పోలీసులు చురుగ్గా స్పందించాలని కోరారు. కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని నాదెండ్ల వెల్లడించారు.

“వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం తమ గూండా నాయకులు, కార్యకర్తలకు మద్దతు కొత్త చట్టాలు చేస్తుందేమో అనే సందేహం ఉంది. వారికి మిగిలిన ఈ నాలుగు నెలల్లో… హారన్ కొట్టడం, సైకిల్ మీద తిరగడం, రోడ్డు మీద నడవడం కూడా నేరాలుగా పరిగణిస్తూ చట్టాలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు” అంటూ నాదెండ్ల ఓ ప్రకటనలో వ్యంగ్యం ప్రదర్శించారు.