నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు నివాళ్లు అర్పించిన మోడీ

నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ 126 వ జయంతి సందర్బంగా ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. భారతదేశ చరిత్రకు నేతాజీ చేసిన అసమానమైన కృషిని మోడీ గుర్తు చేసుకుంటున్నాన్నారు. వలస పాలనకు తీవ్రంగా ప్రతిఘటించిన ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని కొనియాడారు. అతని ఆలోచనలకు తాము ప్రభావితమయ్యామని తెలిపారు. ఆయన కలలను సాకారం చేయడానికి తాము కృషి చేస్తున్నామని మోడీ ట్వీట్ లో పేర్కొన్నారు.

భారతమాత ముద్దు బిడ్డ నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు నివాళులర్పిస్తున్నామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు. నేతాజీ ఎనలేని ధైర్యానికి, దేశభక్తికి ప్రతీక అని కొనియాడారు. ఆయన నాయకత్వంలో లక్షలాది మంది దేశప్రజలు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పారు. ఆయనకు దేశం ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటుందని పేర్కొన్నారు.

ప్రతి సంవత్సరం జనవరి 23న నేతాజీ జయంతిని దేశ వ్యాప్తంగా ‘పరాక్రమ్ దివస్’గా ఘనంగా జరుపుకుంటాం. తన మాటలతో ప్రతి వ్యక్తిలోనూ స్వాతంత్యం కోసం పోరాడాలనే కాంక్ష రగిలించిన వీరుడు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడాలి అడుక్కోవడం కాదు అనే ఆలోచన సుభాష్ చంద్ర బోస్ లో మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరిలోనూ కలిగిన వ్యక్తి. ఆయనలో ఆవేశం ఎక్కువ. ప్రతి మాటా ఓ తూటాలా ఉండి.. నాటి యువతకు స్వాతంత్య్రం కోసం పోరాడేలా చేసింది.

గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది. బోసు రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీతో సిద్ధాంత పరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు. గాంధీ యొక్క అహింసావాదం మాత్రమే స్వాతంత్ర్య సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని బోసు భావన. ఈ అభిప్రాయాలతోనే ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు.

దాదాపు 11 సార్లు ఆంగ్లేయులచే కారాగారంలో నిర్బంధించ బడ్డాడు. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బ తీయటానికి దీన్ని ఒక సువర్ణవకాశంగా బోసు భావించాడు. యుద్ధం ప్రారంభం కాగానే అతను ఆంగ్లేయుల పై పోరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ, జపాను దేశాలలో పర్యటించాడు. జపాను సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు, ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు.

జపాను ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్థిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని సింగపూర్ లో ఏర్పరచాడు. బోసు రాజకీయ అభిప్రాయాలు, జర్మనీ, జపాన్‌తో అతని మిత్రత్వం పై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు వీటిని విమర్శిస్తే, మరి కొందరు వాస్తవిక దృష్టితో చేసిన ప్రయత్నాలుగా బోసును అభిమానిస్తారు. అతని జీవితం లాగే మరణం కూడా వివాదాస్పదమైంది. 1945 ఆగస్టు 18 లో తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో బోసు మరిణించాడని ప్రకటించినప్పటికి, అతను ప్రమాదం నుంచి బయట పడి అజ్ఞాతం లోకి వెళ్ళాడని పలువురు నమ్ముతారు.