శ్రీ చైతన్య కాలేజీ ఘటనపై స్పందించిన మంత్రి సబితా
శ్రీచైతన్య కాలేజీ యాజమాన్యంపై కేసు నమోదు
హైదరాబాద్ః నార్సింగి శ్రీ చైతన్య క్యాంపస్లో సాత్విక్ అనే విద్యార్థి క్లాస్రూంలోనే ఉరేసుకున్నాడు. యాజమాన్యం తీవ్ర ఒత్తిడి వల్లనే అతను బలవన్మరణానికి పాల్పడ్డాడని విద్యార్థి తల్లిదండ్రులతో పాటు తోటి విద్యార్థులు చెబుతున్నారు. ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడి కుటుంబ సభ్యులు, విద్యార్థులు కాలేజీ క్యాంపస్ దగ్గర ఆందోళనకు దిగారు. ఈక్రమంలో సాత్విక్ ఆత్మహత్యపై విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ జరపాలని తెలంగాణ ఇంటర్ బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్ కు ఆదేశాలు జారీ చేశారు.
కాగా, ఈ ఘటనకు సంబంధించి శ్రీ చైతన్య కాలేజ్ యాజమాణ్యంపై 305 ఐపీసీ కింద కేస్ నమోదు చేశారు నార్సింగ్ పోలీసులు. ఈ ఘటనలో ఇప్పటికే పోలీసుల నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఆచార్య, రమేష్,తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు. మరోవైపు విద్యార్థి ఆత్మహత్యపై శ్రీచైతన్య కాలేజీ యాజామాన్యం స్పందించింది. మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటించింది. విద్యార్థి మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.