పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ఎందుకు చేస్తున్నాడో చెప్పాలి – రోజా

వైస్సార్సీపీ మంత్రి రోజా..ఈరోజు శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ..చంద్రబాబు , నారా లోకేష్ , పవన్ కళ్యాణ్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు బస్సు యాత్ర చేపడుతున్నాడో ముందు చెప్పాలని రోజా అన్నారు. జనసేన పార్టీని పెట్టింది ఎవరి కోసమని మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబుకు మద్దతు ఇవ్వడానికే పవన్ పాకులాడుతుంటారని ఆమె దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్‌కు దమ్ము, ధైర్యం ఉంటే గత టీడీపీ మేనిఫెస్టో… తమ పార్టీ మేనిఫెస్టోను దగ్గరపెట్టి ప్రజల్లోకి వెళ్లాలని ఆమె సవాల్ విసిరారు.

‘‘పవన్ కళ్యాణ్, లోకేశ్‌కు మేమే ఎక్కువ… సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు వస్తారు. ఎక్కడికైనా చర్చకు వచ్చేందుకు మేము సిద్ధం’’ అంటూ మంత్రి రోజా స్పష్టం చేశారు. పదో తరగతి ఫలితాలపై కూడా టీడీపీ రాజకీయ చెయ్యడం దిగజారుడుతనానికి నిదర్శనమని ఆమె వ్యాఖ్యానించారు. జూమ్ మీటింగ్‌లో కొడాలి నాని, వంశీ వస్తే… లోకేశ్‌కు ఎందుకు పారిపోయాడని ఆమె ప్రశ్నించారు. జీవితంలో లోకేశ్ అసెంబ్లీలోకి రాలేడని రోజా జోస్యం చెప్పారు. ఎన్నికల్లో ఓడిపోతే టీడీపీని మూసేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పదే ప్రకటనలు చేస్తున్నారని, 2019 నుంచి రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతోందని మంత్రి గుర్తుచేశారు.