లోకేష్ అంకుల్ ఏం చేయబోతున్నారో చెప్పకుండానే పాదయాత్ర చేస్తున్నారంటూ రోజా ఎద్దేవా

యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫై వైస్సార్సీపీ మంత్రి రోజా పలు విమర్శలు చేసింది. లోకేష్ అంకుల్ ఏం చేయబోతున్నారో చెప్పకుండానే పాదయాత్ర చేస్తున్నాడని ఎద్దేవా చేసారు. తన తండ్రి రాష్ట్రానికి ఏం చేశారో, రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారో చెప్పకుండానే నడుస్తున్నారని, చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు దోచుకుని హైదరాబాద్ లో దాచుకున్నారని, ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ను ముఖ్యమంత్రి పీఠం ఎక్కించాలని కొడుకు లోకేష్ తహతహలాడుతున్నారని విమర్శించారు.

తండ్రీకొడుకులు అవసరమైనప్పుడల్లా నందమూరి కుటుంబాన్ని వాడుకుంటున్నారని, అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని విస్మరిస్తున్నారని రోజా విమర్శించారు. సెక్యూరిటీ, వాలంటీర్లు లేకపోతే లోకేష్ పాదయాత్రలో 10 మంది కూడా ఉండరని రోజా అన్నారు. నాయకుడిగా లోకేష్ ఫెయిల్యూర్ అని , ఇది గుర్తించే మంగళగిరి ప్రజలు లోకేశ్ ను ఓడించారని అన్నారు. గతంలో కాంగ్రెస్ తో కుమ్మక్కై చంద్రబాబు వేధించినప్పటికీ జగనన్న ఆత్మస్థైర్యంతో పాదయాత్రను ప్రారంభించారని… పేదల కష్టాలను విన్నారని, అధికారంలోకి వచ్చాక ఆ కష్టాలను తీర్చారని చెప్పారు. ఆ ధైర్యంతోనే తనకు మళ్లీ ఓట్లు వేయాలని జగనన్న అడుగుతున్నారని అన్నారు.