మునుగోడు కు మంత్రి కేటీఆర్..అభివృద్ధి పనులపై సమీక్ష

మునుగోడును దత్తత తీసుకుంటున్నట్లు ఉప ఎన్నికల్లో హామీ ఇచ్చిన మంత్రి కేటీఆర్..ఆ హామీ ప్రకారం మునుగోడు అభివృద్ధి ఫై దృష్టి సారించారు. ఈరోజు మునుగోడు కు బయలుదేరారు. మునుగోడు ఉప ఎన్నికలో ఇచ్చిన హామీల అమలుతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి పనులపై నేడు మంత్రులు సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్‌తోపాటు మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు మునుగోడు వెళ్లనున్నారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరి 11 గంటల వరకు మంత్రుల బృందం మునుగోడుకు చేరుకుంటారు. మునుగోడులోని ధనలక్ష్మీ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించే సమీక్షా సమావేశంలో వీరంతా పాల్గొననున్నారు.

స్థానిక సంస్థల్లో పాలన, ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, కరెంట్‌ సమస్యలు, గిరిజన తండాల అభివృద్ధి తదితర అంశాలు ప్రధాన ఏజెండాగా ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా మున్సిపాలిటీల్లో రోడ్లు, సమీకృత మార్కెట్లు, జంక్షన్లు, పార్కులు, తాగునీరు, వీధి దీపాలు, డ్రైనేజీ వంటి అంశాలతో పాటు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నారు. ఇంకా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపైనా ప్రణాళికలు సిద్ధం చేసేలా సమీక్ష చేపట్టనున్నారు.