ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య ఎన్నికల పోరాటం: మంత్రి కెటిఆర్

కెసిఆర్‌పై రేవంత్ రెడ్డి పోటీ అంటే పోచమ్మగుడి ముందు పొట్టేలును కట్టేసినట్లే.. కెటిఆర్‌

Minister KTR Public Meeting In Kamareddy

బిక్కునూరు: కామారెడ్డికి వచ్చి కెసిఆర్‌ పై తొడగొట్టడం అంటే పోచమ్మ గుడి ముందు పొట్టేలును కట్టేసినట్లని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మంత్రి కెటిఆర్ అన్నారు. బిక్కునూరులో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… గత ఎన్నికల్లో షబ్బీర్ అలీని గంపకింద కమ్మేశామని, ఈసారి షబ్బీర్ అలీ వచ్చినా, రేవంత్ రెడ్డి వచ్చినా అదే చేయాలన్నారు. కెసిఆర్‌ కొడంగల్ వచ్చి పోటీ చేయకుంటే తానే కామారెడ్డికి వస్తానని రేవంత్ సవాల్ చేశారన్నారు. ఆయన తీరు చూస్తుంటే తెగబలిసిన కోడి చికెన్ షాప్ ముందు తొడ కొట్టినట్లుగా ఉందన్నారు. పోచమ్మ గుడి ముందు పోచమ్మ గుడి ముందు పొట్టేలును కట్టేసినట్లే అన్నారు. ఉద్యమాల గడ్డ కామారెడ్డిలో ఉద్యమ నాయకుడు కెసిఆర్‌పై సవాల్ చేయడం అంటే అది మంచి పద్ధతి కాదన్నారు.

పైగా ఉద్యమకారుల పైకి తుపాకీ తీసుకుపోయిన రైఫిల్ రెడ్డి ఈ రోజు వచ్చి కెసిఆర్‌పై గెలుస్తానని చెబుతున్నారని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. అందరూ ఆలోచించి ఓటేయాలన్నారు. కెసిఆర్‌ కామారెడ్డి వచ్చి పోటీ చేయడానికి కారణం ఎమ్మెల్యే గంపా గోవర్ధన్ అన్నారు. కామారెడ్డికి తాను కొంత చేశానని, కానీ తమ నియోజకవర్గం కోరిక నెరవేరాలంటే గోదావరి నీళ్లు ఇక్కడకు తీసుకు రావాలన్నారు. ఇలా జరగాలంటే మీరు కామారెడ్డికి వచ్చి పోటీ చేయాలని గంపా గోవర్ధన్ కోరారని, దీంతో కెసిఆర్‌ అంగీకరించినట్లు చెప్పారు. నవంబర్ 9న కెసిఆర్‌ నామినేషన్ దాఖలు చేస్తారన్నారు. ఆ రోజు జరిగే సభతో ప్రతిపక్షాల అభ్యర్థులు నామినేషన్ కూడా దాఖలు చేయకుండా చేయాలన్నారు.

కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అంటారని, కామారెడ్డికి కెసిఆర్‌ రావడం అంటే అదే అన్నారు. కెసిఆర్‌ రావడంతో కామారెడ్డి దశ తిరుగుతుందన్నారు. ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇస్తారనే విశ్వాసం ఉందన్నారు. గతంలో పలుమార్లు గంపా గోవర్ధన్ చేతిలో ఓడిపోయిన షబ్బీర్ అలీ, ఇప్పుడు కెసిఆర్‌ స్వయంగా పోటీ చేయడంతో ఆయన మరో ఆలోచన చేస్తున్నారన్నారు. షబ్బీర్ అలీ నిజామాబాదుకో.. ఎల్లారెడ్డికో వెళ్తున్నట్లుగా తెలిసిందన్నారు. కాంగ్రెస్, బిజెపి ఇచ్చే పిప్పరమెంట్లు, చాక్లెట్లు తిందామా? కెసిఆర్‌ను గెలిపించుకొని దమ్ బిర్యానీ.. పంచభక్ష పరమాన్నం తిందామా? ప్రజలు ఆలోచించాలన్నారు. ప్రతిపక్షాలు డబ్బులు ఇస్తే తీసుకొని, ఓటు మాత్రం బిఆర్ఎస్‌కు వేయాలన్నారు.

సోనియా గాంధీ వందలమందిని బలితీసుకున్నారని, రాహుల్ గాంధీ ముద్దపప్పు అని స్వయంగా రేవంత్ రెడ్డే చెప్పారన్నారు. కానీ రేవంత్‌కు ఈ రోజు సోనియా కాళీమాతలాగా కనిపిస్తోందని, ముద్దపప్పు రాహుల్ నిప్పులెక్క కనిపిస్తున్నాడని ఎద్దేవా చేశారు. దొరలకు, ప్రజలకు మధ్య పోటీ అని రాహుల్ గాంధీ చెప్పారని, ఆయన చెప్పింది నిజమేనని, ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న పోరు అన్నారు. రాహుల్ గాంధీ అసలు లీడర్ కాదని, రీడర్ అన్నారు. ఆయన ఇచ్చింది చదివి వెళ్తాడన్నారు. ఢిల్లీకి, తెలంగాణకు మధ్య జరుగుతోన్న పోరాటం ఈనాటిది కాదన్నారు.