శంషాబాద్‌ నుంచి మూసీ పై ఎక్స్‌ప్రెస్‌వే నిర్మిస్తాం : మంత్రి కెటిఆర్‌

నార్సింగిలో ఇంటర్‌చేంజ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కెటిఆర్

ts-minister-ktr-participates-in-inauguration-of-interchange-on-orr-at-narsingi

హైదరాబాద్‌ః నేడు హైదరాబాద్‌ నార్సింగి వద్ద ఓఆర్‌ఆర్‌పై నిర్మించిన ఇంటర్‌ చేంజ్‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి కెటిఆర్‌ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. నార్సింగి వద్ద రూ.29.50 కోట్లతో ఇంటర్‌ చేంజ్‌ నిర్మించామని, ఓఆర్‌ఆర్‌పై ఇది 20వ ఇంటర్‌ చేంజ్‌ అన్నారు. త్వరలో మరొకటి అందుబాటులోకి వస్తుందన్నారు. ఔటర్‌పై స్పీడ్‌ లిమిట్‌ను 120 కిలోమీటర్లకు పెంచామని చెప్పారు. దేశంలో ఏ నగరానికి లేని ప్రత్యేకత హైదరాబాద్‌కు ఉందని మంత్రి అన్నారు. 100 శాతం మురుగునీటి శుద్ధి చేసే తొలి నగరంగా చరిత్ర సృష్టించబోతున్నదని చెప్పారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు హైదరాబాద్‌కు మణిహారంలా ఉన్నదని వెల్లడించారు.

మూసీ నదిపై 14 బ్రిడ్జిల నిర్మాణాలకు అనుమతులిచ్చామని మంత్రి కెటిఆర్‌ తెలిపారు. త్వరలోనే వాటికి శంకుస్థాపన చేయనున్నామని, ఐదు టెండర్ల దశలో ఉన్నాయని చెప్పారు. శంషాబాద్‌ నుంచి నాగోల్‌ వరకు 55 కిలోమీటర్ల మేర మూసీపై ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మిస్తామన్నారు. దానికి రూ.15 వేల కోట్ల వరకు ఖర్చవనుందని చెప్పారు. మూసీ నదిపై స్కైవే నిర్మిస్తామని తెలిపారు. కరోనా వల్ల మూసీ సుందరీకరణను అనుకున్నంత వేగంగా చేయలేకపోయామని వెల్లడించారు. రెండున్నరేండ్లలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రోను పూర్తిచేస్తామని వెల్లడించారు. బీహెచ్‌ఈఎల్‌ నుంచి కందుకూరు ఫార్మాసిటీ వరకు మెట్రో రైలు నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.

దేశంలోని ఏ మెట్రో నగరానికి లేని ప్రత్యేకత సెప్టెంబర్‌ 2 నాటికి హైదరాబాద్‌కు రాబోతున్నదని వెల్లడించారు. అందులో మొదటి ఫలితాలు నేడు అందుతున్నాయని చెప్పారు. నగరంలో 100 శాతం మురుగునీటి శుద్ధి చేయబోతున్నామని తెలిపారు. మురుగునీటి శుద్ధి కోసం దాదాపు రూ.3,866 ఖర్చుతో కొత్తగా 31 మురుగునీటి శుద్ధి ప్లాంట్‌ల (ఎస్టీపీ) నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, అందులో మొదటిది నేడు కోకాపేటలో ప్రారంభిస్తున్నామని చెప్పారు. సెప్టెంబర్‌ నాటికి దశలవారిగా దేశంలోనే 100 శాతం మురుగునీటిని శుద్ధిచేస్తున్న తొలి నగరంగా హైదరాబాద్‌ చరిత్ర సృష్టించనుందని చెప్పారు. శుద్ధి చేసిన నీటిని పునర్‌వినియోగించేలా ప్రభుత్వం ఒక విధానం తీసుకురాబోతున్నదని వెల్లడించారు. తద్వారా హైదరాబాద్‌ విశ్వనగరంగా ఎదగలన్న ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆశయం నెరవేరుతుందని తెలిపారు.

హైదరాబాద్‌ అభివృద్ధికి సహకరించాలని కేంద్రాన్ని కోరినా స్పందించడం లేదని కెటిఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెహిదీపట్నంలో స్కైవాక్‌ కోసం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ని అడిగామని చెప్పారు. కొత్త లింక్‌ రోడ్లకు సహకరించాలని అడిగామని, జూబ్లీ బస్టాండ్‌ వరకు స్కైవాక్‌ కోసం భూములు కేటాయించాలని కోరామన్నారు. భూమికి బదులు భూమి ఇస్తామన్నప్పటికీ కేంద్రం నుంచి స్పందన లేదని వెల్లడించారు. హైదరాబాద్‌ అభివృద్ధికి నిర్విరామంగా కృషి చేస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సైకిల్‌ట్రాక్‌ ఏర్పాటు చేస్తున్నామని, ఆగస్టులో ప్రారంభిస్తామని మంత్రి కెటిఆర్‌ చెప్పారు.