ఆయిల్ కంపెనీల నష్టాలు తప్ప ఆడబిడ్డల కష్టాలు కనిపించవా..?: కెటిఆర్
హైదరాబాద్ః మంత్రి కెటిఆర్ మరోసారి మోడి సర్కార్పై మండిపడ్డరు. ప్రధాని మోడీ పాలనలో ధరలు ఆకాశాన్నంటి.. ఆదాయాలు పాతాళంలో కూరుకుపోతున్నాయని మంత్రి కెటిఆర్ విమర్శించారు. ఆయిల్ కంపెనీలకు కాసుల పంటలు పండిస్తూ.. సామాన్య ప్రజల గుండెల్లో గ్యాస్ మంటలు రేపుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు కెటిఆర్ ట్వీట్ చేశారు. ‘‘ పేద, మధ్యతరగతి మహిళల వంటింట్లో నుంచే బిజెపి పతనం షురూ. గ్యాస్ సబ్సిడీని ఎత్తివేస్తరు.. కంపెనీలకు ప్యాకేజీలు ఎత్తిపోస్తారా..? రూ.400 ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు రూ.1100 ఇంకా పెరుగుతూనే ఉంది. ఆయిల్ కంపెనీలకు కాదు. ఆర్థికంగా నష్టపోయిన ఆడబిడ్డలకు ఇవ్వాలి స్పెషల్ ప్యాకేజీలు’’ అన్నారు.
‘‘సిలిండర్ భారాన్ని మూడింతలు చేసి, ఇప్పుడు మూడు సిలిండర్ల జపం చేస్తారా? మూడు సిలిండర్లతో మూడు పూటలా వంట సాధ్యమా..? ఆయిల్ కంపెనీలకు ఆర్థిక సాయం..!! ఆడబిడ్డలపై ఆర్థిక భారమా..? ఆయిల్ కంపెనీల నష్టాలు తప్ప ఆడబిడ్డల కష్టాలు కనిపించవా..? గరీబోల్ల గుండెలపై మోయలేని గుదిబండలు.. ఈ గ్యాస్ బండలు. మహిళా లోకానికి అర్థమైంది, మోయలేని భారం మోపే వాడే, మోడీ.’’ అని ట్వీట్ చేశారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/international-news/